ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ఫలితాలు నిజమయ్యాయి. కమలం పార్టీదే అధికార పీఠమని ముందుగానే చెప్పిన జోస్యం ఫలించింది. అయితే ఈ విజయం అందుకోవడానికి BJP మూడు దశాబ్దాలు వేచిచూడాల్సి వచ్చింది. 1952లో హస్తినలో సాధారణ ఎన్నికలు జరగ్గా, 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారి అసెంబ్లీ రద్దు అయింది. కానీ 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతం(NCR)గా ప్రకటించడంతో 1993లో తిరిగి తొలిసారి ఎన్నికలు జరిగాయి.
ఇదీ దేశ రాజధాని చరిత్ర…
1993లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో 49 స్థానాలతో BJP గెలవగా, మదన్ లాల్ ఖురానా CM అయ్యారు. అప్పుడు పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. 1998లో కాంగ్రెస్ 52 చోట్ల గెలిచి షీలా దీక్షిత్ ను CM చేసింది. ఆ కాలంలో వాజ్ పేయి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇలా ఢిల్లీలో BJP CM ఉన్న కాలంలో కేంద్రంలో కాంగ్రెస్… హస్తం పార్టీ CMగా ఉన్న టైంలో కేంద్రంలో కమలం పార్టీ అధికారంలో ఉన్నాయి. 2003లో 47 స్థానాలతో గెలిచిన కాంగ్రెస్, 2008లోనూ 43 సీట్లను దక్కించుకుంది. ఇలా వరుసగా రెండు ఎన్నికల్లో గెలవగా, ఈ రెండుసార్లూ షీలా దీక్షితే ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా ఢిల్లీకి ఆమె మూడుసార్లు CMగా బాధ్యతలు నిర్వర్తించారు.
కమలానికి సీట్లు వచ్చినా…ప్చ్!
2013లో BJP 31, AAP 28, కాంగ్రెస్ 8 సీట్లు సాధిస్తే.. హస్తం పార్టీ సపోర్ట్ తో కేజ్రీవాల్ CM అయ్యారు. అప్పుడు కమలానికి ఎక్కువ సీట్లు వచ్చినా లాభం లేకుండా పోయింది. 2015లోనూ AAP 67 సీట్ల బంపర్ మెజారిటీ సాధించడంతో కేజ్రీవాల్ మరోసారి CM పదవి చేపట్టారు. ఆ టైంలో BJPకి 3 స్థానాలు వస్తే, కాంగ్రెస్ ఒక్కటీ గెలవలేదు. 2020లోనూ ఆప్ 62 సీట్లు ఎగరేసుకుపోతే మిగతా 8 బీజేపీవి. ఇక్కడా కాంగ్రెస్ కు సున్నానే మిగిలింది.