హైదరాబాద్ కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. చెట్లు నరికిన వంద ఎకరాల్లో పునరుద్ధరణ ఎలా చేస్తారు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ప్రశ్నించింది. జంతుజాలాన్ని ఎలా రక్షిస్తారో నాలుగు వారాల్లోగా ప్రణాళిక తెలియజేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అనుమతుల మేరకే చెట్లు కొట్టివేశామని సర్కారు తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం.. 100 ఎకరాల్లో నష్టం జరిగిందని, అక్కడ నిజంగా పర్మిషన్ తీసుకున్నారా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
అనుమతి తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) బాధ్యులవుతారని, సుప్రీం గైడ్ లైన్స్ పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. ఈ భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించాలని అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడు) సూచించారు. తదుపరి విచారణను కోర్టు మే 15కు వాయిదా వేసింది.