
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పాటులో ఆయన అందించిన సేవల్ని సభ్యులు గుర్తు చేసుకున్నారు. గద్దర్ మృతి బాధాకరం అంటూ మంత్రి కేటీఆర్ శాసనసభలో సంతాప ప్రకటన చేశారు. కవిగా, గాయకుడిగా గద్దర్ తన ఆటపాటలలో ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు. ఆయన గళంతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారన్న KTR.. ఆయన మృతి తెలంగాణకు లోటుగా అభివర్ణించారు.
ఎల్బీ స్టేడియానికి గద్దర్ భౌతిక కాయం
గద్దర్ భౌతిక కాయాన్ని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ నుంచి L.B.స్టేడియానికి తరలించారు. ప్రజలు సందర్శించేందుకు వీలుగా గద్దర్ భౌతిక కాయాన్ని L.B.స్టేడియానికి తరలించారు. ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కోదండరామ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, VH, సీతక్క, విమలక్క, ప్రొ.హరగోపాల్ తదితరులు నివాళులర్పించారు.