అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలకు కీలకం హార్మూజ్ జలసంధి. దీని గుండా 82% క్రూడాయిల్, ఇతర ఇంధనాల రవాణా జరుగుతోంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు ఇక్కణ్నుంచే 70% చమురు వెళ్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతులకు అడ్డుకట్ట పడుతుంది. అరేబియా సముద్రంలో ఇరాన్-ఒమన్ కు చెందిన మొసాండం ద్వీపకల్పం మధ్యలోనున్న హార్మూజ్.. 33 కిలోమీటర్ల ఇరుకైన ప్రదేశంలో ఉంటుంది. నౌకల కోసం కేవలం 2 కి.మీ. నావిగేషన్ ఛానల్ మాత్రమే ఉంటుంది. అందుకే ఇది అత్యంత ప్రమాదకర రద్దీ మార్గం. సౌదీ, UAE, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ నుంచి ప్రతిరోజు 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు ఎగుమతవుతుంది. ప్రపంచ వినియోగంలో ఇది 21 శాతం. ద్రవరూప సహజ గ్యాస్ 20% దీన్నుంచే రవాణా.
భారత్ కు వచ్చే 40% చమురు సౌదీ, ఖతార్, ఇరాన్ నుంచే ఉంటోంది. దీన్ని మూసేస్తే మనకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి దిగుమతి చేయాలి. అలా జరిగితే ఖర్చు బాగా పెరుగుతుంది. పెట్రోలు, డీజిల్, ఎల్ఎన్జీ ధరలు పెరుగుతాయి. అయితే దీనికి భయపడాల్సిన పనిలేదని కేంద్రం చెబుతోంది. మరో 70 రోజుల వరకు మనవద్ద నిల్వలున్నాయని తెలిపింది. ఇక ఎర్ర సముద్రంపైనే ఆధారపడితే.. హౌతీల దాడుల భయం ఉంటుంది. భారత్ ఎగుమతులు 80% ఎర్ర సముద్రంపైనే ఉన్నాయి.